సెలబ్రిటీల జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా సంచలనంగా మారిపోతుంది. తమ అభిమాన హీరో, హీరోయిన్లు పెట్టే ప్రతి పోస్టును క్షణాల్లో లైక్లు, కామెంట్లు, షేర్లతో వైరల్ చేస్తుంటారు. ఇక బర్త్డేలు, కొత్త సినిమా అప్డేట్లు, కుటుంబ కార్యక్రమాలు అన్నీ అభిమానులతో పంచుకోవడంలో స్టార్లు ముందుంటారు. అయితే ఈసారి అల్లు ఫ్యాన్స్కు మాత్రం అనుకోని షాక్ తగిలింది.
అల్లు ఫ్యామిలీ యువ హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం రద్దు అయింది. ఈ నెల అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా జరగాల్సిన ఎంగేజ్మెంట్, మొంథా తుపాను ప్రభావంతో రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించగా, ఆ పోస్టు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ సోదరుడు, నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అయిన అల్లు శిరీష్, నైనికా అనే యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో, ఎలాంటి హడావుడి లేకుండా స్వగృహంలోనే ఎంగేజ్మెంట్ వేడుక జరపాలని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మొంథా తుపాను కారణంగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వేదికను దెబ్బతీశాయి. ఏర్పాటు చేసిన పందిరి, అలంకరణలతో సహా మొత్తం కూలిపోయిందట.
దీంతో శిరీష్ తన ఇన్స్టాలో, “ప్రకృతి ముందు మనం అశక్తులమే. వేదిక ధ్వంసమైంది. అందుకే వేడుకను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది” అంటూ పోస్టు చేశారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు అదే తేదీన ఇన్డోర్ వేదికలో నిశ్చితార్థం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై స్పష్టత త్వరలో రానుంది.
మరోవైపు, రెండు నెలల క్రితం అల్లు శిరీష్ నాయనమ్మ మరణించిన నేపథ్యంలో, ఇంత త్వరగా వేడుకలు పెట్టడంపై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, అల్లు శిరీష్ కెరీర్లో ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలు మాత్రమే మంచి విజయాలు సాధించాయి. కానీ ‘బడ్డీ’ వంటి ఇటీవలి చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
